కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, నంబర్ల వివరాలివే..


 

ANDHRA PRADESH,KURNOOL: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు శుక్రవారం తెల్లవారుజామున చిన్న టేకూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి దాకా 19 మంది మృతదేహాలను అధికారులు బస్సు నుంచి వెలికితీశారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ఘటనాస్థలికి పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాధితుల కుటుంబసభ్యుల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసింది. హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.

కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. చిన్న టేకూరు వద్ద బస్సు.. ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీకొట్టడం, వెంటనే బస్సులో మంటలు చెలరేగటంతో బైక్ మీద ఉన్న వ్యక్తితో పాటు బస్సులోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 19 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫోరెన్సిక్‌ బృందాలు మృతదేహాలను బస్సులో నుంచి వెలికితీశాయి.

మరోవైపు ఈ ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన.. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో విచారణ చేయించాలని ఆదేశించారు. అలాగే ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు గుర్తించాలని.. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు.

కర్నూలు బస్సు ప్రమాదం.. ఘటనాస్థలికి హోం మంత్రి అనిత

మరోవైపు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనాస్థలికి పరిశీలించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రమాద స్థలాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాలతో కలిసి పరిశీలించారు.ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించేందుకు అవసరమైతే ఘటనాస్థలంలోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బస్సుప్రమాదం అత్యంత బాధాకరమన్న వంగలపూడి అనిత.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

మరోవైపు కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో పలువురు చనిపోగా.. కొంతమంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. కర్నూలు కలెక్టరేట్, కర్నూలు ఆస్పత్రి, ఘటనాస్థలం వద్ద హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.