INDIA, MUMBAI : నవీ ముంబై విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మోదీకి ప్రత్యేక కానుక ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్పెషల్ గిఫ్ట్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే అది శివకర్ బాపూజీ తల్పాడే రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి విమాన ప్రతిరూపం. 1895లోనే 'మారుత్ సఖా' అనే మానవరహిత విమానాన్ని తల్పాడే నిర్మించి నడిపారని చెబుతున్నారు. ఈ లెక్కన రైట్ బ్రదర్స్ కంటే ముందుగానే భారతీయులు విమానాన్ని కనిపెట్టారన్నమాట.
ముంబై ఎయిర్పోర్టుపై భారాన్ని తగ్గించేందుకు నవీ ముంబై విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ ఎయిర్పోర్టును బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోడర్న్ ఆర్కిటెక్చర్తో పాటు అత్యాధునిక సదుపాయాలతో భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఈ ఎయిర్పోర్టును రూపొందించారు. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ఎయిర్పోర్టు మోడల్ను కానుకగా ఇచ్చారు. అయితే ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మాత్రం ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. భారతదేశపు మొట్టమొదటి విమాన ప్రతిరూపాన్ని బహూకరించారు.
సాదారణంగా అందరూ విమానాన్ని ఎవరు కనిపెట్టారు అని అడిగితే.. రైట్ బ్రదర్స్ అని ఠక్కున చెబుతారు. అయితే అంతకంటే ముందే.. మహారాష్ట్రకు చెందిన శివకర్ బాపూజీ తల్పాడే విమానం తయారు చేశారట. ఆయన 1895లో 'మారుత్ సఖా' అనే మానవరహిత విమానాన్ని నిర్మించి నడిపారని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు.
ఈ కథల ప్రకారం.. 1895లో ముంబైలోని చౌపట్టి బీచ్లో శివకర్ బాపూజీ తల్పాడే ఒక విమాన ప్రయోగాన్ని నిర్వహించారు. అక్కడ మానవరహిత విమానం తక్కువ ఎత్తులో ఎగిరిందని చెబుతారు. ఇదే నిజమైతే.. రైట్ బ్రదర్స్ కన్నా ఎనిమిదేళ్ల ముందే భారతీయులు విమానాన్న కనిపెట్టినట్లు అవుతుంది. 1903లో రైట్ బ్రదర్స్ సక్సెస్ఫుల్ ఫైట్ ప్రయోగం చేశారు. వీరు మానవసహిత సస్టేన్డ్, కంట్రోల్డ్ ఫ్లైట్ను నడిపారు. అయితే తల్పాడే విమాన ప్రయోగం గురించి సరైన ఆధారాలు లేవు. రికార్డు చేయబడిన ఫోటోగ్రాఫిక్ లేదా శాస్త్రీయ ఆధారాలు లేవు.
సంస్కృత పండితుడైన శివకర్ బపూజీ తల్పాడే 1864లో ముంబైలో జన్మించారు. సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో విద్యాభ్యాసం చేశారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. భారతీయ పురాణ శాస్త్రాలు, గ్రంథాలపై తల్పాడేకు అమితమైన ఆసక్తి ఉండేది. వైమానిక శాస్త్రం వంటి గ్రంథాల ఆధారంగానే.. 'మారుత్ సఖా' (వాయు స్నేహితుడు) విమానాన్ని ఆయన తయారు చేశారంటారు. అనంతతరం ముంబై బీజ్లో దాన్ని ప్రయోగించారట. ఈ ప్రయోగానికి అప్పటి బరోడా మహారాజు షయాజీరావు గైక్వాడ్ 3 హాజరయ్యారని చెబుతారు. ఆ తర్వాత శివకర్ బాపూజీకి.. మహారాజు ఆర్థిక సహాయం కూడా అందించినట్లు స్థానికుల మాట. అయితే బ్రిటీష్ వలస పాలకులు ఆయన చేసిన పనిని అశాస్త్రీయం అంటూ కొట్టిపారేసేవారట. తదుపరి ప్రయోగాలు చేయకుండా నిరుత్సాహపరిచేవారట.శివకర్ బాపూజీ తల్పాడే జీవితం ప్రేరణతో ఆయుష్మాన్ ఖురానా హీరోగా 2015లో హవైజాదా అనే చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ చిత్రంలో అనేక మార్పులు చేశారు. ఇందులో మానవ సహిత విమాన ప్రయోగం చూపించారు.

Social Plugin