రాజమండ్రి: మా ఇంట్లో బాబు ఒక్కడే పాలు తాగుతాడు.. బాలుడి తల్లి ఆవేదన..


 

ANDHRAPRADESH,RAJAMAHENDRAVARAM  : రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మనోహర్ అనే ఆరేళ్ల బాలుడు మంగళనారం కన్నుమూశాడు. విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళనారం మధ్యాహ్నం చనిపోయాడు. కిడ్నీ వైఫల్యం కారణంగానే మనోహర్ చనిపోయినట్లు తెలిసింది. మరోవైపు కల్తీ పాల కారణంగానే తన కొడుకు చనిపోయాడని బాలుడి తల్లి అర్చన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి రోజు నుంచే బాలుడి ఆరోగ్యం దెబ్బతిందని చెప్తున్నారు. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోయారు.

రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో ప్రాణం పోయింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా.. మంగళవారం రోజున మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోహర్ అనే ఆరేళ్ల బాలుడు కన్నుమూశాడు. కేజీహెచ్ ఆస్పత్రి వైద్యులు.. క్రిటికల్ కేర్ విభాగంలో బాలుడికి చికిత్స అందించారు. 63 సార్లు డయాలిసిస్ చేశారు. కిడ్నీ పనిచేయకపోవటంతోనే బాలుడు చనిపోయినట్లు తెలిసింది. పీడియాట్రిక్ విభాగంలో కిడ్నీ బయాప్సీ నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు కల్తీ పాలు తాగే తమ అబ్బాయి చనిపోయాడని మనోహర్ తల్లి అర్చన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్లుగా అతని వద్దే పాలు తీసుకుంటున్నామని.. ఇంట్లో మా బాబు ఒక్కడే పాలు తాగుతాడని అర్చన చెప్తున్నారు. శివరాత్రి నుంచి మా అబ్బాయికి ఆరోగ్యం బాలేదని..ఆరోజు నుంచే మూత్రం రావటం ఆగిపోయిందన్నారు. మొదట రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని.. అక్కడి నుంచి కాకినాడకు పంపించారని తెలిపారు. అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారని.. మంగళవారం మధ్యాహ్నం చనిపోయినట్లు బాలుడి తల్లి చెప్తున్నారు. మరోవైపు పిల్లాడి మీద గంపెడాశలు పెట్టుకుని బతుకుతున్నామని.. ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ బాలుడి అమ్మమ్మ వాపోతున్నారు.

నిందితుడికి రిమాండ్ 

మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు అడ్డాల గణేష్ అనే పాల వ్యాపారిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. కల్తీ పాల ఘటనలో పోలీసులు గణేష్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపరచగా. విచారణ చేపట్టిన స్థానిక కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

మరోవైపు రాజమహేంద్రవరంలోని లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరినగర్‌ పరిసర ప్రాంతాల్లో వైద్య శాఖ అధికారులు పలు నమూనాలను సేకరించారు. ఈ శాంపిళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను మరో నెలపాటు పర్యవేక్షించాలని అధికారులు నిర్ణయించారు.