నిడదవోలు: చదివింది మూడు.. కేసులు 35.. వీడెవడండీ బాబూ..


 

ANDHRAPRADESH, NEDADAVOLU: తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం జిల్లాకు చెందిన సన్యాసిరావు అనే వ్యక్తిని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండ్రాజవరంలో జరిగిన ఓ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సన్యాసిరావును అరెస్ట్ చేశారు. మూడో తరగతి చదివిన సన్యాసిరావుపై 35 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం, వెండితో పాటుగా నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

చదివింది మూడో తరగతి.. కానీ నేరాలలో మాత్రం ఆరితేరిపోయాడు. ఏకంగా 35 కేసులు అతనిపై నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కేటుగాణ్ని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలవరం జిల్లాలోని అడ్డతీగల మండలం గొంటివారిపాలేనికి చెందిన సన్యాసిరావు అనే వ్యక్తిని నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉండ్రాజవరంలో జరిగిన ఓ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సన్యాసిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.

ఉండ్రాజవరంలోని భోగవల్లి వారివీధిలో ఇటీవల చోరీ జరిగింది. ఈ వీధికి చెందిన వెంకటరత్నం కుటుంబం డిసెంబర్ 9వ తేదీ ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లింది. అయితే అదే రోజురాత్రి వెంకటరత్నం ఇంట్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండుగులు ఇంటి తాళాన్ని పగలగొట్టి.. చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉంచిన సుమారు 223 గ్రాముల బంగారంతో పాటుగా, 250 గ్రాముల వెండితో పాటుగా మూడు లక్షల రూపాయల నగదును కూడా చోరీ చేశారు. అయితే ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు ఇంట్లో చోరీ జరిగిన సంగతిని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో ఈ చోరీకి పాల్పడింది సన్యాసిరావేనని గుర్తించారు.

జనవరి రెండో తేదీ సన్యాసిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ వద్ద సన్యాసిరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సన్యాసిరావు వద్ద నుంచి 223 గ్రాముల బంగారంతో పాటుగా.. 250 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సన్యాసిరావుపై గోకవరం పోలీస్ స్టేషన్‌తో పాటుగా ప్రత్తిపాడు, ఆత్రేయపురం ఇలా 35 చోట్ల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన సన్యాసిరావును సామర్లకోట పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. రాజమండ్రి జైలులో కొంతకాలం శిక్ష కూడా అనుభవించాడని.. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ నేరాలు మొదలెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

సన్యాసిరావు మూడో తరగతి వరకూ చదివాడని.. తొమ్మిదేండ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2013లో పెళ్లి చేసుకున్నాడని.. ఏడాదిపాటు ఓ సంస్థలో కూడా పనిచేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వ్యసనాలకు బానిసగా మారి.. చోరీలు మొదలు పెట్టినట్లు పోలీసులు వివరించారు.