టీటీడీపై ఏపీ హైకోర్టు సీరియస్.. ఈవో కోర్టుకు రావాల్సిందే, రాకపోతే రూ.20వేలు జరిమానా


 

AP HIGH COURT ON PARAKAMANI CASE: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. కౌంటర్‌ దాఖలు చేయడంలో టీటీడీ ఈవో ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ ఈవో ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కేసులో సీఐడీ విచారణ చేపట్టింది. ఇటీవల పోలీసుల నిర్లక్ష్యంపై కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల పరకామణి చోరీ కేసుపై విచారణ చేపట్టింది. ఈ కేసులో సీజ్ చేసిన ఫైళ్లను, ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసుపై కౌంటర్‌ దాఖలు చేయడంలో ఆలస్యంపై టీటీడీ ఈవోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ నెల 27న ఈవో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. హాజరు కాకపోతే రూ.20 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి టీటీడీ సమయం కోరడంతో.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

గత ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో జరిగిన భారీ దొంగతనం కేసులో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఉద్యోగి రవికుమార్ పరకామణిని కొల్లగొట్టారని ఆరోపణలు రావడంతో.. అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తతో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరించింది. గతంలో ఉన్నత న్యాయస్థానం సీఐడీ విచారణకు ఆదేశించడంతో.. సీఐడీ అధికారులు పరకామణికి సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

తిరుమల పరకామణి చోరీకి సంబంధించిన కేసులో ఇటీవల సీఐడీ బృందం రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టిన సీఐడీ.. డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లోనూ రికార్డులను పరిశీలించింది. 2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. 920 డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్‌ పట్టుబడ్డారు. ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. లోక్‌ అదాలత్‌తో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేయించదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ ప్రారంభించింది.

తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణికి సంబంధించిన కేసుపై ఈ నెల 13న హైకోర్టు విచారణ జరిపింది. సెప్టెంబర్ 19న తిరుమల పరకామణిలో అక్రమాలపై లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్‌ చేయాలని ఆదేశించింది. అయితే పోలీసు శాఖ, డీజీపీ ఈ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదంటూ జరిపిన విచారణలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు శాఖ నిద్రపోతోందని.. రాష్ట్రంలో పోలీసు శాఖను మూసివేయడమే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. సీఐడీలో ఐజీ పోస్టు లేకపోతే వెంటనే తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని.. తగిన ఉత్తర్వులు ఎందుకు పొందలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే సీఐడీ బృందం రంగంలోకి దిగి.. రాజీ కుదుర్చుకున్న అన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసింది.