చదివింది ఇంటర్.. ఏకంగా బెట్టింగ్ యాప్ తయారీ, రూ.కోట్లల్లో సంపాదన.. రిచ్ ఇల్లు కట్టి ఫేస్ లాక్ సిస్టం


 

ANDHRA PRADESH CHITTOOR: చిత్తూరు జిల్లాకు చెందిన చందు అనే యువకుడు బెట్టింగ్ యాప్ ద్వారా కోట్లు సంపాదించి అడ్డంగా దొరికిపోయాడు. ఇంటర్ చదివిన చందు మొదట మొబైల్ షాపు నడిపి, తర్వాత క్రికెట్ బెట్టింగ్స్ ప్రారంభించాడు. రాధా ఎక్స్చేంజ్ పేరుతో బెట్టింగ్ యాప్ సృష్టించి యువతను మోసం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం అతను వలలో చిక్కుకొన్నారు. పోలీసులు చందును అరెస్టు చేసి, అతను కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించారు.

మనోడు చదివింది ఇంటర్.. మొబైల్ షాపు నడిపాడు. అయితే ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు.. ఏకంగా రూ.కోట్లలో వెనకేశాడు. అయితే డ్యామిట్ కథ అడ్డం తిరిగి దొరికిపోయాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన నాగరాజు కుమారుడ చందు. ఐదేళ్ల క్రితం చిన్న మొబైల్ షాపు ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత చందు క్రికెట్ బెట్టింగ్స్‌లోకి దిగాడు.. ఆ తర్వాత ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో తానే సొంతంగా బెట్టింగ్ యాప్ తయారు చేయించాడు. యువతకు ఐడీలు ఇచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టమని ఆశ పెట్టాడు.

రాధా ఎక్స్ఛేంజ్" పేరుతో బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందని మాయ మాటలు చెప్పాడు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనోడి ట్రాప్‌లో పడ్డారు. ఈ బెట్టింగ్ దెబ్బకు పలమనేరుకు చెందిన ఒక కానిస్టేబుల్ అప్పుల బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలాగే నేలపల్లెకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే అతడు పోలీసుల్ని ఆశ్రయించాడు.. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే చందు ముందుగానే అలర్ట్ అయ్యాడు. ముందుగానే సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు.

ఇంతలో రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ చందుపై మరో ఫిర్యాదు అందింది.. తాను కూడా ఇదే యాప్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో చందూ మాత్రమే కాదు మరో 11మందిని కూడా చేర్చారు. చందును ఆదివారం రోజు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. చందు బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన డబ్బులతో చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులో భవనాలు, స్థలాలు కొనుగోలు చేశాడు. సొంత ఊరిలో ఖరీదైన భవనం నిర్మించాడు.. ఇంటిలో ఫేస్‌లాక్ సిస్టం కూడా ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఆ ఇంట్లోని ప్రతి గదిలో లేసటెస్ట్ ఫర్నీచర్ కూడా ఉంది. చందు బంగారం, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు మొబైల్స్, రూ.70 లక్షలు ఖరీదైన కారు, బైక్‌లు కూడా కొనుగోలు చేశాడు.