ANDRAPRADESH, AMARAVATHI: ఏపీలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ వివరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఒకేసారి రెండు శుభవార్తలు వినిపించారు రేషన్ కార్డు లబ్ధిదారులకు నూనె కందిపప్పు గోధుమపిండి రాగులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే రేషన్ సరుకులు నెల మొత్తం అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ రెండు నిర్ణయాలు అమలులోకి వస్తే ఏపీలోని రేషన్ లబ్ధిదారులకు నెలలో ఎప్పుడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, నూనె, రాగులు, గోధుమపిండి అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏపీలోని రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రేషన్ దుకాణాల్లో త్వరలోనే కందిపప్పు, రాగులు, నూనె, గోధుమ పిండి అందిస్తామని అన్నారు.
అలాగే రేషన్ దుకాణాల్లో నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్న మంత్రి.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అలాగే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకుల పంపిణీ విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఎండీయూ వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం.. రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందిస్తోంది.
ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారం సహా.. ఉదయం, సాయంత్రం రెండు పూటలా రేషన్ దుకాణాల వద్ద డీలర్లు లబ్ధిదారులకు రేషన్ అందిస్తున్నారు. అలాగే నెల ప్రారంభం కాకముందే.. ముందు నెల 25వ తేదీ నుంచే దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు నెలలో సగం రోజులు తమకు ఎప్పుడు వీలైతే అప్పుడు రేషన్ తీసుకునే అవకాశం దక్కింది.
Social Plugin